హైదరాబాద్ నగరంలో నేర ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళనల మధ్య మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటుండగా, తాజాగా వనస్థలిపురం పరిధిలో జరిగిన ఘోర హత్య స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని సునీతను ఆమె మాజీ భర్త మహేష్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం ప్రకారం.. నిందితుడు రెండు కత్తులు, ఒక పెట్రోల్ డబ్బా తీసుకుని అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని హెచ్చరిస్తూ అక్కడి పరిస్థితిని భయంకరంగా మార్చినట్లు విచారణలో వెల్లడైంది.
మహేష్ సునీతపై కత్తులతో తీవ్రంగా దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. దాడి అనంతరం పూల కుండతో ఆమె తలపై కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అపార్ట్మెంట్ నివాసితులు ఆందోళనతో బయటకు రావడానికి కూడా భయపడినట్లు తెలుస్తోంది.
